కోనసీమ అందాలు, పావన గోదావరీ గలగలలతో అలరారుతూ ప్రాకృతిక సౌందర్యం కొలువైన జిల్లా తూర్పుగోదావరి జిల్లా. కోస్తాంధ్రకు కీలకస్థానమైన ఈ జిల్లాకు ఆధ్యాత్మిక గుర్తింపు తెచ్చిన దేవస్థానం అంతర్వేది లక్ష్మీనరసింహాలయం. నరసింహుని రూపం ఉగ్రరూపం. మృగరాజైన సింహం తలతో ప్రళయభీకరంగా కనిపించినా, భక్తుల పాలిట మాత్రం మనసున్న దేవుడే. భక్త సులభుడని పేరున్న శ్రీ మహావిష్ణువు దశావతార స్వరూపమే నరసింహావతారం. దేవదేవుడైన మహావిష్ణవు లోకకళ్యాణం కోసం దశవతారాలను దాల్చగా, అందులో నాలుగో అవతారం నారసింహావతారం. ఆలయ విశిష్టత బంగాళాఖాతం తీరాన కొలువైన క్షేత్రం అంతర్వేది. ప్రశాంత పరిసరాల్లో కొలువైన ఈ ఆలయాన్ని దర్శిస్తే మనసు కూడా అంతే ప్రశాంతంగా మారుతుందట. ఎన్ని సమస్యలతో ఈ క్షేత్రంలో అడుగుపెట్టినా, అన్నీ దూరమైన అనుభూతి ప్రసాదిస్తాడని అంతర్వేది నరసింహస్వామికి పేరు. కోరమీసాలవాడు అంతర్వేది నారసింహుడు. కోరమీసాలు.. వీరత్వానికి ప్రతీక. అలాంటి ఈ స్వామిని మొక్కుకుంటే అనంత ధైర్యసాహసాలను ప్రసాదిస్తాడట. మానసిక ఆందోళనలతో బాధపడేవారు ఈయన మీద భారం వేసి కేవలం టెంకాయ సమర్పించినా, ధృడమైన మనసును ఇస్తాడని భక్తుల నమ్మకం. ఏదైనా ఇబ్బందితో బాధ...