కోనసీమ అందాలు, పావన గోదావరీ గలగలలతో అలరారుతూ ప్రాకృతిక సౌందర్యం కొలువైన జిల్లా తూర్పుగోదావరి జిల్లా. కోస్తాంధ్రకు కీలకస్థానమైన ఈ జిల్లాకు ఆధ్యాత్మిక గుర్తింపు తెచ్చిన దేవస్థానం అంతర్వేది లక్ష్మీనరసింహాలయం.
నరసింహుని రూపం ఉగ్రరూపం. మృగరాజైన సింహం తలతో ప్రళయభీకరంగా కనిపించినా, భక్తుల పాలిట మాత్రం మనసున్న దేవుడే. భక్త సులభుడని పేరున్న శ్రీ మహావిష్ణువు దశావతార స్వరూపమే నరసింహావతారం. దేవదేవుడైన మహావిష్ణవు లోకకళ్యాణం కోసం దశవతారాలను దాల్చగా, అందులో నాలుగో అవతారం నారసింహావతారం.
ఆలయ విశిష్టత
బంగాళాఖాతం తీరాన కొలువైన క్షేత్రం అంతర్వేది. ప్రశాంత పరిసరాల్లో కొలువైన ఈ ఆలయాన్ని దర్శిస్తే మనసు కూడా అంతే ప్రశాంతంగా మారుతుందట. ఎన్ని సమస్యలతో ఈ క్షేత్రంలో అడుగుపెట్టినా, అన్నీ దూరమైన అనుభూతి ప్రసాదిస్తాడని అంతర్వేది నరసింహస్వామికి పేరు.
కోరమీసాలవాడు అంతర్వేది నారసింహుడు. కోరమీసాలు.. వీరత్వానికి ప్రతీక. అలాంటి ఈ స్వామిని మొక్కుకుంటే అనంత ధైర్యసాహసాలను ప్రసాదిస్తాడట. మానసిక ఆందోళనలతో బాధపడేవారు ఈయన మీద భారం వేసి కేవలం టెంకాయ సమర్పించినా, ధృడమైన మనసును ఇస్తాడని భక్తుల నమ్మకం. ఏదైనా ఇబ్బందితో బాధపడుతున్నవారు ఈ సన్నిధిలో 5 ప్రదిక్షణలు చేసి టెంకాయ సమర్పిస్తే చాలంటారు. అంతటి మహిమాన్విగా ఈ స్వామి మహిమలను చాటుతున్నాడు.
పూజాదికాలు
ఈ పుణ్యప్రదేశంలో సుప్రభాతం, నివేదన, అష్టోత్తర పూజలు, నరసింహ దండకాలు, హారతులతో ఈ క్షేత్రం మారుమోగుతూ ఉంటుంది. అంతర్వేది క్షేత్రంలో నిత్యం అభిషేకాలు, హోమాలు, యాగాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ కలశపూజలను సైతం విశేషంగా నిర్వహిస్తారు. అంతర్వేది క్షేత్రంలో ఉత్సవమూర్తుల వద్ద అర్చన చేయించుకుంటే చాలా శుభప్రదం అని అంటారు. దంపతులు ఇలా పూజార్చన నిర్వహిస్తే, సంసార జీవితంలో కలతలు ఉండవని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి.
అంతర్వేది నరసింహస్వామి ఉత్సవాల్లో ఫిబ్రవరి మాసంలో ఇక్కడ నిర్వహించే స్వామి కళ్యాణోత్సవాలు, రథోత్సవాలు ప్రధానమైనవి. ఈ వేడుకలనే అంతర్వేది తిరునాళ్లని అంటారు. రథారూఢుడైన స్వామి భిన్న విభిన్న రూపాలు దాల్చి ఆలయ పురవీధుల్లో ఊరేగుతారు.
చారిత్రక సంపద
ఈ ఆలయాన్ని 15 నుంచి 16 వ శతాబ్ధం మధ్యలో నిర్మితమైనట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. అనేకమంది రాజులు, చక్రవర్తులు ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడ్డారు. కనువిందైన ఆలయ స్తంభాలు, అబ్బురపరిచే విగ్రహాలు, విశాల మండపాలు, ప్రాకారాలు, గోపురాలతో భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి అచ్చమైన ప్రతిరూపంగా ఈ క్షేత్రం కనిపిస్తుంది.
స్థల పురాణం
కృతయుగంలో వశిష్ట మహాముని గోదావరిలోని ఓ పాయను తెచ్చి సాగరసంగమం గావించి ఇదే ప్రాంతంలో తపస్సు చేస్తుంటాడు. అయితే విశ్వామిత్రుని ప్రోద్భలంతో రక్తవిలోచనుడు అనే రాక్షసుడు వశిష్టుని తపస్సుకు భంగం కల్గించడమే కాకుండా, అతని కుమారులను హతమారుస్తూ ఉంటాడు. అప్పుడు వశిష్టుడు నరసింహస్వామిని ప్రార్ధించగా, ఆయన ప్రత్యక్షమై రక్తవిలోచనుడితో యుద్ధం చేస్తాడు. ఆ రాక్షసుడిని భూమిపై పడే ప్రతీ రక్తపు బొట్టూ, ఓ రాక్షసుడిగా మారుతుంటుంది. అప్పుడు నరసింహుడు అశ్వరూఢాంబికా అనే మాయాశక్తిని రప్పించి, రాక్షసుడి రక్తం నేలపై పడకుండా నాలుక చాచాలని సూచిస్తాడు. స్వామి ఆదేశం మేరకు ఆమె నాలుక చాచగా, రాక్షసుడిని నరసింహుడు సంహరిస్తాడు. ఆపై , వశిష్టుని కోరిక మేరకు నరసింహాస్వామికి ఇక్కడ కొలువైనట్లు ప్రతీతి.
ఎలా వెళ్లాలి?
అంతర్వేది క్షేత్రం ఉభయగోదావరి జిల్లాల మధ్యలో ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నుంచి, పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం నుంచి విస్తృతమైన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. నర్సాపురానికి హైదరాబాద్ నుంచి రైళ్లో కూడా వెళ్లవచ్చు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి